కలం, వెబ్ డెస్క్: జర్నలిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో జర్నలిస్టుల ఇండ్లపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Womens Day) సందర్భంగా ప్రజా భవన్లో నిర్వహించిన వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందన్న భరోసా కల్పించేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణలో జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలు పెండింగ్ ఉన్నాయని, దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు.
మహిళల పేరు మీద ఇల్లు ఉంటేనే శ్రేయస్కరమని, త్వరలో అందరికీ గుడ్ న్యూస్ చెప్తామని వెల్లడించారు. మహిళా రక్షణకు ప్రత్యేక కమిటీలు వేయాలని భావిస్తున్నట్లు సీఎం తెలిపారు. ప్రింట్, డిజిటల్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో నిజానిజాలను బయటపెట్టేందుకు చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. జర్నలిస్టుల ముసుగులో కొందరు చేసే పనులను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చిస్తామని తెలిపారు. డెస్క్, ఫీల్డ్ జర్నలిస్టులను అందరినీ సమానంగా చూస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జర్నలిస్టుల నివాస సముదాయాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. చట్ట పరంగా దీనికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
దేశంలో ఏ పదవినైనా మహిళలకు కేటాయించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని సీఎం అన్నారు. మహిళ నేతృత్వంలో పని చేస్తున్న కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని, ఆ తెలంగాణ తల్లి స్ఫూర్తితో పాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. మహిళలు ప్రభుత్వం కల్పించే అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ముఖ్యమైన శాఖల్లో మహిళలకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. అందరూ తమ తమ పరిధిలో సమర్థవంతంగా పని చేస్తున్నారని కొనియాడారు. 700 మంది మావోయిస్టుల లొంగుబాటు వెనుక ఓ మహిళా అధికారిని కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. మహిళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అన్ని సంస్థలపై ఉందని సీఎం (CM Revanth Reddy) స్పష్టం చేశారు.
మహిళలకు ఇందిరమ్మ ఇండ్లు (Indiramma Indlu), ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలను 1000 బస్సులకు యజమానులను చేసి కార్పొరేట్లతో పోటీ పడే అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. అలాగే సోలార్ పవర్లో భాగంగా 1000 మెగా వాట్స్ విద్యుత్తు ఉత్పత్తి చేసేలా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. అమెజాన్తో ఒప్పందం చేసుకొని తెలంగాణలో మహిళలు తయారు చేసే వస్తువులకు అమెజాన్లో స్థానం కల్పించామన్నారు. కార్పొరేట్ల కంపెనీలు తయారు చేసే వస్తువులతో మన తెలంగాణ మహిళల హస్త కళా వస్తువులు పోటీ పడుతున్నాయన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలంతా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులయ్యారని చెప్పారు.
Read Also: నా ఇద్దరు కుమారులను అలా పెంచుతా.. జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Follow Us On: Facebook

