కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపుల్లో ఆలస్యంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి ప్రతి నెలా ఒకటో తేదీనే రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు జమ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏమాత్రం ఆలస్యం చేసినా.. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆర్థిక శాఖ అన్ని విభాగాలకు కీలక సర్క్యులర్ జారీ చేసింది. ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు జమ చేసేలా హెచ్ఓడీలు, డీడీవోలు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆలస్యమైతే వారిదే బాధ్యతని, కఠినంగా క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించింది. సమన్వయ బాధ్యతలను సెక్రటరీ గౌరవ్ ఉప్పల్కు అప్పగించింది. ఆర్థిక శాఖ ముందే అన్ని విభాగాలకు నిధులు అందిస్తున్నా.. అలసత్వం కారణంగానే ఆలస్యంగా వేతనాలు జమ చేస్తున్నట్లు సీఎం రేవంత్ గుర్తించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

