కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) నగరంలో బాలికపై జరిగిన అమానుష దాడి, హత్యాయత్నం ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన నిందితుడిని చట్టపరంగా అత్యంత కఠినంగా శిక్షిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఖమ్మం రాపర్తి నగర్లో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. నిందితుడిపై వెంటనే కఠిన చట్టాల కింద కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
ఘటన తెలిసిన వెంటనే మంత్రి పొంగులేటి వేగంగా స్పందించి, బాధిత బాలిక తండ్రితో పాటు స్థానిక నాయకులతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. “ముందు మన పాప ప్రాణాలను కాపాడుకుందాం… అధైర్యపడకండి… నేనున్నాను” అంటూ బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. బాలికకు అత్యున్నత వైద్యం అందించేందుకు తక్షణమే హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చును తానే భరిస్తానని మంత్రి ప్రకటించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబానికి అన్ని విధాలా పూర్తి న్యాయం జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు.

