కలం, క్రైమ్ డెస్క్: ముఖ్యమంత్రి సహా మంత్రుల కాన్వాయ్లు రోడ్లపై ప్రయాణించేటప్పుడు సామాన్య ప్రజానీకం వాడే వాహనాలను ఆపివేసే పద్ధతికి స్వస్తి చెప్పాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని డీజీపీ సీవీ ఆనంద్కు సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా హైదరాబాద్లోని ఎయిర్పోర్టు దగ్గర సీఎం కాన్వాయ్ కోసం రెండువైపులా వాహనాలను నిలిపివేసిన విషయాన్ని తెలుసుకున్న ఆయన ఢిల్లీకి వెళ్ళిన వెంటనే వీడియో కాన్ఫరెన్సు ద్వారా డీజీపీతో డిస్కస్ చేశారు. ఒకవైపు సీఎం కాన్వాయ్ వెళ్తూ ఉంటే రెండో వైపు వాహనాలను ఆపాల్సిన అవసరం లేదని, ఆ సమయంలో విధుల్లో ఉన్న అధికారులతో మాట్లాడి వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి స్పష్టం చేశారు. సెక్యూరిటీలో ఉండే వీఐపీలు ప్రయాణించేటప్పుడు సాధారణ ప్రజలను రోడ్లపై ఎక్కువసేపు నిలిపివేయకూడదని నొక్కిచెప్పారు.
ట్రాఫిక్ కంట్రోల్ బ్యూరో ఏర్పాటు :
కాన్వాయ్ల కారణంగా ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయని వివరించిన సీఎం రేవంత్రెడ్డి.. ఈ కారణంగా రద్దీ నెలకొనడం మంచిది కాదన్నారు. బాధ్యతలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ట్రాఫిక్ నిలిపేయాల్సి వస్తే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలన్నారు. అన్ని పోలీసు కమిషనరేట్ల పరిధిలోని శాంతిభద్రతల విభాగం, ట్రాఫిక్ విభాగలోని అధికారులకు ఈ వీడియో కాన్ఫరెన్సులో సీఎం క్లారిటీ ఇచ్చారు. వీఐపీ కాన్వాయ్ల సమయంలో పూర్తిగా ట్రాఫిక్ నిలిపేయకూడదన్నారు. మరోవైపు రోడ్డుమీద వాహనాలను ఆపాల్సిన అవసరమే లేదన్నారు. పీక్ అవర్స్లో ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసి వాహనదారులకు తెలియజేయాలన్నారు. ప్రజలకు అసౌకర్యం లేకుండా, ఆ ఇబ్బందులను తగ్గించే విధంగా ట్రాఫిక్ ప్లాన్ ఉండాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నిర్వహణను బలోపేతం చేయడానికి అదనపు డీజీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక ట్రాఫిక్ బ్యూరో ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ ఈ సందర్భంగా సీఎంకు వివరించారు.

