కలం, వెబ్ డెస్క్: జూన్ రెండో తేదీన జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ వేడుకల సమయాన్ని మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. విపరీతమైన ఎండల నేపథ్యంలో వేడుకలను ఉదయం 8.30 గంటలకే ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని సీఎస్ను ఆదేశించారు. జాతీయ పతాకావిష్కరణతో పాటు అన్ని రకాల కార్యక్రమాలను గంటన్నర వ్యవధిలో పూర్తి చేయాలని సూచించారు. సీఎం సూచనలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. సాధారంగా వేడుకల కార్యక్రమాలు మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంటాయి.
పరేడ్ గ్రౌండ్స్లో ముమ్మర ఏర్పాట్లు..
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ ముస్తాబు అవుతోంది. జూన్ రెండో తేదీన ఉదయం పూట జరిగే ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరు కాబోతున్నారు. రాష్ట్ర ప్రత్యేకతలను వివరించేలా శకటాలు రూపొందిస్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా వేడుకలకు హాజరయ్యే అతిథులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపడుతున్నారు.

