కలం వెబ్ డెస్క్: కేరళ (Kerala)లో యూడీఎఫ్ స్పష్టమైన ఆధిక్యంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఫలితాలు పూర్తిగా వెల్లడి కాకముందే అటు కేరళలో ఇటు తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా కేరళలో విస్తృత ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో కేరళ ఎన్నికల గేమ్ ఛేంజర్ రేవంత్ రెడ్డి అంటూ కాంగ్రెస్ శ్రేణులు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. సీఎం రేవంత్ కేరళలో ఏప్రిల్ 1, 2 వ తేదీల్లో పలు బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించారు. కేరళలో రేవంత్ ప్రచారం పార్టీకి బాగా ఉపయోగపడిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో రేవంత్రెడ్డి ప్రచారం చేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ను టార్గెట్ చేశారు. ‘నీ పో మానె విజయన్’ అనే డైలాగ్ జనంలోకి విస్తృతంగా వెళ్లి వర్కవుట్ అయింది. అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయన్ను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కాపాడుతున్నదని బలమైన ఆరోపణలు కూడా చేశారు. మోడీ, విజయన్ మధ్య రహస్య ఒప్పందం ఉన్నదనే కామెంట్ కూడా బాగా పాపులర్ అయింది. ఈ విమర్శ చేసినందుకే రేవంత్రెడ్డికి విజయన్ బహిరంగ లేఖ రాయాల్సి వచ్చింది. దీనికి రేవంత్రెడ్డి సైతం గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఒక దశలో పినరయి విజయన్ను రేవంత్రెడ్డి తన ట్రాప్లోకి లాగారని, దాంతో ఎన్నికల ప్రచారంలో విజయన్ దూకుడుగా వెళ్ళలేకపోయారని ఆ రాష్ట్రంలో సాధారణ అభిప్రాయం నెలకొన్నది. తెలంగాణ పరిధిని దాటి సీఎం రేవంత్రెడ్డి ఇతర రాష్ట్రాల్లోనూ స్టార్ క్యాంపెయినర్గా మాత్రమే కాక కొత్త నెరేటివ్ సృష్టించడంలో పొలిటీషియన్గా సక్సెస్ అయ్యారని ఏఐసీసీలో ఒక అభిప్రాయం నెలకొన్నది.
సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ, విజయన్ ఒకేలాంటి స్వభావమున్న వ్యక్తులని, ఇద్దరికీ పెద్దగా తేడాలు లేవని విమర్శించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్తో పాటు పినరయి విజయన్కు సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం నడిచింది. ఇద్దరు నాయకులు పరస్పరం తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. ఇక రేవంత్ రెడ్డి కేరళ ప్రజలు బాగా చదువుకున్న వారని, తెలివైన వారని, ఎన్నికల్లో మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానంటూ ప్రచారంలో వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ ప్రచారాం చేసిన అన్ని స్థానాల్లో యూడీఎఫ్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మొత్తానికి కేరళ ప్రచారంలో దూసుకెళ్లిన రేవంత్ పార్టీ ఖాతాలో మరో విజయం పడేందుకు దోహదపడ్డారని కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

