కలం, వెబ్ డెస్క్ : దేశ విద్యా వ్యవస్థలో తెలంగాణను నెంబర్ వన్ గా నిలబెట్టాలన్నదే తమ లక్ష్యం అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. దీని కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఉపయోగపడతాయనే నమ్మకం ఉందన్నారు. కేంద్ర విద్యాశాఖ “ఫెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (PGI)” నివేదిక తెలంగాణ పనితీరు మెరుగయిందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. అభివృద్ధికి తొలి కొలబద్దత విద్య అని.. చదువు ఒక్కటే పేదరికాన్ని నిర్మూలించి, సమాజాన్ని జాగృతం చేయగలదన్నారు. ఆ దిశగా రెండేళ్లు ప్రజా ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని ఆయన వెల్లడించారు.
ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా విద్యా శాఖ బాధ్యతలు స్వయంగా తీసుకున్నట్లు రేవంత్ తెలిపారు. గడచిన రెండేళ్లుగా తెలంగాణ మోడల్ స్కూళ్ల ఏర్పాటు, నూతన ఉపాధ్యాయుల నియామకం, డిజిటల్ విద్యకు ప్రాధాన్యత, ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ సదుపాయం, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, డ్రాపౌట్ల నియంత్రణ వంటి అంశాలపై బలమైన కార్యచరణ తీసుకున్నట్లు సీఎం వివరించారు.
పాఠశాల విద్యలో తెలంగాణ పనితీరు గణనీయంగా మెరుగుపడిందని తాజాగా కేంద్ర విద్య శాఖ PGI లో పేర్కొనడం తమ ప్రభుత్వ కృషికి నిదర్శనమని సీఎం ఆనందం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో జరిగిన విద్య విధ్వంసం నుంచి విద్యా వికాస పునర్ నిర్మాణానికి నడుం బిగించామన్నారు. తాజా ఫలితాలతో సంతృప్తి పడటం లేదన్నారు.

