సీఎం భద్రాచలం టూర్.. సమస్యలపై సమీప ప్రాంతాల ప్రజల రిక్వెస్ట్

కలం, ఖమ్మం బ్యూరో : శ్రీరామనవమి సందర్భంగా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భద్రాచలంలో పర్యటించి (Bhadrachalam Tour) రూ.351 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే భద్రాచలానికి సమీపంలో ఉన్న సారపాక, బూర్గంపాడు, మణుగూరు, పాల్వంచ ప్రాంతాల ప్రజలు “మా మీద కూడా దయచూపండి” సారు అని వేడుకుంటున్నారు. ముఖ్యంగా పై ప్రాంతాలన్నీ ఏజెన్సీ ఏరియాలో ఉండడం వలన అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని స్థానికుల చెప్తున్నారు. ఇక్కడ రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. వర్షాకాలంలో ముంపు సమస్య, వేసవి కాలంలో తాగు నీటి సమస్య, విద్యా, వైద్య సౌకర్యాలు కొరత ఉంది. సారపాక లో పేపర్ బోర్డు వంటి పెద్ద పరిశ్రమ ఉన్నా.. ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడంలేదు. పేపర్ బోర్డు నుంచి వచ్చే కాలుష్యం వలన ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మణుగూరులో సింగరేణి బొగ్గు బావులు, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, హెవీ వాటర్ ప్లాంట్ వంటి పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నప్పటికీ ఈ ప్రాంతం ఎన్నో ఏళ్లుగా ఎదుగూ బొదుగూ లేకుండా ఉన్నది. ప్రధానంగా మణుగూరులో సరైన బస్టాండ్ లేదు, 40 ఏళ్ల క్రితం నిర్మించిన బస్టాండ్ నిర్మానుష్యంగా తయారైంది. ప్రయాణీకులు బస్ ఎక్కడానికి ప్రయివేటు వారు ఏర్పాటు చేసిన బస్టాండ్ ను ఆశ్రయిస్తున్నారు. రోడ్ల పరిస్థితి కూడా అధ్వాన్నంగా ఉంది. ముఖ్యంగా బీటీపీఎస్ మార్గంలో రోడ్లపైన కంకర తేలి, ప్రమాదాల నిలయంగా మారుతున్నాయి. అలాగే సింగరేణి, బీటీపీఎస్ నుంచి కాలుష్యం విపరీతంగా వస్తుంది. దీంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. పేరుకే మణుగూరు మున్సిపాలిటీ కానీ ఇక్కడ ఆస్తులకు భద్రత లేదు, ఆస్తి మార్పిడి లేదు. అటు ఏజెన్సీ చట్టాలు, ఇటు మున్సిపాలిటీ చట్టాలు వర్తించకపోవడం వలన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇన్ని సమస్యల నేపథ్యంలో సీఎం భద్రాచలంతో పాటు ఇతర ఏజెన్సీ ప్రాంతాలపై కూడా దయ చూపుతారని ఇక్కడి ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరి ముఖ్యమంత్రి రేపటి భద్రాచల పర్యటన (CM Bhadrachalam Tour) లో ఏజెన్సీ జిల్లా పై ఎలాంటి వరాలు కురిపిస్తారో వేచి చూడాల్సిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>