కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వ హయాంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ఎప్పుడూ ఆలస్యం జరగలేదని, లబ్ధిదారులకు సకాలంలోనే సాయం అందుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. బిడ్డ పుట్టిన తర్వాతే చెక్కులు ఇస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవన్నీ కేవలం అబద్ధాలు అని ఆయన కొట్టిపారేశారు. ఒకవేళ ఎక్కడైనా చెక్కుల పంపిణీలో జాప్యం జరిగి ఉంటే, అది స్థానిక ఎమ్మెల్యేల కాలయాపన వల్ల మాత్రమే జరిగి ఉంటుందని ఆయన వివరణ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్దేశం ఎప్పుడూ పేదలకు అండగా ఉండటమేనని, క్షేత్రస్థాయిలో ఇలాంటి పొరపాట్లు జరిగితే సరిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు తెలంగాణలో కళ్యాణలక్ష్మి (Kalyana Lakshmi) చెక్కుల పంపిణీ అంశంపై ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం లబ్ధిదారులకు సకాలంలో చెక్కులను అందజేయడంలో విఫలమవుతోందని, పెళ్లి జరిగిన చాలా కాలం తర్వాత, చివరకు బిడ్డ పుట్టిన తర్వాత కూడా చెక్కులు ఇస్తున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు. నిధుల కొరత సాకుతో ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని, దీనివల్ల పేద కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ పైవిధంగా భట్టి స్పందించారు.

