కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి ఏప్రిల్ 6న బాసర పర్యటన చేయనున్నారు. ఈ మేరకు ఏప్రిల్ 6న బాసరలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటించనున్నారని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ఆదివారం తెలిపారు. ఆ రోజున బాసరలో మాస్టర్ ప్లాన్ అమలు చేయడంతో పాటు ఆలయ పున:నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. అలాగే బాసరలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా మథోల్లో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరైనా.. అప్పటి పాలకుల నిర్లక్ష్యం ఆలయ పునర్నిర్మాణానికి నోచుకోలేదని ఆరోపించారు. పలుమార్లు ఈ విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడడం, సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలోనే బాసర ఆలయాభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి బాసరకు రావడం శుభపరిణామం అని చెప్పారు.

