కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో సాదా బైనామా (Sada Bainama) భూములకు సంబంధించి తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఉగాది పండుగ (Ugadi Festival) శుభదినం పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుక సందర్భంగా ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి(Dr. Bachampally Santosh Kumar Sastry) పంచాంగ శ్రవణం చేశారు. కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ ఆలయాలకు చెందిన అర్చకులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)తో కలిసి ముఖ్యమంత్రి సత్కరించారు. శ్రీ పరాభవ నామ ఉగాది పంచాంగాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజుగా నిలబెట్టాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లాలని ఈ సందర్భంగా భగవంతుడిని ప్రార్థించారు.
రైతు సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటిస్తూ.. “ధరణి రూపంలో భూతమై రైతులను బాధ పెడుతున్న సందర్భంగా రైతులకు అండగా దాన్ని తరిమేసి భూ భారతితో (Bhu Bharathi) రైతాంగ సమస్యలను పరిష్కరిస్తున్నాం. సాదా బైనామాకు సంబంధించి తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నామన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు బోనస్ కూడా ఇచ్చి ఆదుకుంటున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కల మేరకు దేశంలో అతితక్కువ రుణభారం కలిగిన రైతులున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు.
పరిశ్రమలు ఎన్ని వచ్చినా, ఐటీ రంగాలు ఎంతగా రాణించినప్పటికీ రాష్ట్రంలో ఇప్పటికీ ప్రధాన జీవనాధారం వ్యవసాయమేనని సీఎం రేవంత్ (CM Revanth Reddy) చెప్పారు. రైతులు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుందన్నారు. రాష్ట్రంలో 25.35 లక్షల రైతు కుటుంబాలకు రూ. 20,616 కోట్ల 2 లక్షల వరకు రుణమాఫీ చేశామన్నారు. ప్రతి ఎకరాకు రూ. 12 వేల చొప్పున రైతు భరోసా అందిస్తున్నామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం 18 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా (Rythu Bharosa) కింద అందించిందని చెప్పారు. వ్యవసాయ రంగానికి ఉచిత కరెంట్, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, రుణమాఫీ చేయడం, రైతుభరోసా అందించడంతో పాటు రైతు బీమా అమలు చేయడం వంటివన్నీ రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలని చెప్పారు. ప్రభుత్వం రైతుల కోసం ప్రయత్నాలు, నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలన్నీ దేశంలో తెలంగాణ ప్రతిష్టను పెంపొదిస్తాయని అభిప్రాయపడ్డారు. మన పొలాల్లో సమృద్ధిగా పంటలు పండినప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో విలసిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: అనుష్క పెళ్లి వార్తలు.. పర్సనల్ టీం సంచలన ప్రకటన!
Follow Us On: Instagram

