కలం, తెలంగాణ బ్యూరో: ఇప్పటివరకూ ఎల్ అండ్ టీ కంపెనీ ఆధ్వర్యంలో నడిచిన హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రైల్ సర్వీసులు తెలంగాణ ప్రభుత్వ పరిధిలోకి వచ్చాయి. ఎల్ అండ్ టీ నుంచి ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకున్నది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి హైదరాబాద్ మెట్రో రైల్ సేవలన్నీ ప్రభుత్వ పరిధిలోకి రానున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మెట్రో రైల్ విస్తరణకు ఇబ్బందులు ఎదురవుతున్నందునే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మెట్రో రైల్ స్వాధీనానికి సంబంధించి తీర్మానాన్ని పురపాలక శాఖ మంత్రిగా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై చర్చల అనంతరం సభ నుంచి ఏకగ్రీవ ఆమోదం లభించింది. లాంఛనంగా మెట్రో రైల్ వ్యవహారాలన్నీ ప్రభుత్వం పరిధిలోకి వచ్చినట్లయింది.
మెట్రో రైల్ విస్తరణకు తదుపరి కార్యాచరణ :
హైదరాబాద్ మెట్రో రైల్ (Hyderabad Metro) సేవలను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ మేరకు డీపీఆర్ను కూడా రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపింది. పలుమార్లు ప్రధాని మోడీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తదితరులతో స్వయంగా ముఖ్యమంత్రి చర్చించి వివరించారు. కేంద్రం నుంచి అనుమతి కోసం విజ్ఞప్తి చేశారు. ఫస్ట్ ఫేజ్ మార్గాన్ని ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకున్నందున విస్తరణకు అడ్డంకులు తొలగినట్లయింది. ఇకపైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఫేజ్-2, 3 విస్తరణ పనులు జరగనున్నాయి. ఫస్ట్ ఫేజ్ను ఎల్ అండ్ టీ కంపెనీ నుంచి స్వాధీనం చేసుకోవడంలో భాగంగా రూ. 2000 కోట్ల సీడ్ క్యాపిటల్ భారాన్ని, వివిధ బ్యాంకుల్లో ఉన్న రూ. 13 వేల కోట్ల మేర రుణాలను కూడా ప్రభుత్వం భరించనున్నది. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానంపై బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నే హరీశ్రావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సభలో లోతుగా చర్చ జరగకుండానే ఆమోదం పొందడాన్ని తప్పుపట్టారు. ఏకగ్రీవ ఆమోదం అని ప్రభుత్వం చెప్పుకుంటున్నా అది ఏకపక్ష నిర్ణయమని విమర్శించారు.
Read Also: గ్యాస్ కష్టాలకు చెక్: గుజరాత్ తీరానికి భారీ ఎల్పీజీ ట్యాంకర్
Follow Us On: X(Twitter)

