కలం, నల్లగొండ: నల్లగొండ (Nalgonda) జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం సోమవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిలిపివేసిన కల్యాణ లక్ష్మి పథకం నిధులను వెంటనే విడుదల చేసి, లబ్ధిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన (BRS Protest) ప్రదర్శన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి (Kancharla Bhupal Reddy) నాయకత్వంలో నిర్వహించిన ఈ ధర్నా కార్యక్రమానికి నల్లగొండ జిల్లా నలుమూలల నుండి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
కలెక్టరేట్ ముట్టడికి యత్నించడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నిలిచిపోయిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను వెంటనే పంపిణీ చేయాలని, అర్హులైన లబ్ధిదారులందరికీ పథకం వర్తింపజేసి ఆర్థిక సాయం అందించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యాన్ని నిరసిస్తూ ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని అన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పేద నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలిచే కల్యాణ లక్ష్మి పథకం నిధులను నిలిపివేయడం దారుణమని మండిపడ్డారు. లబ్ధిదారులకు వెంటనే న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా తీవ్రరూపం దాల్చడంతో ముందస్తు జాగ్రత్త చర్యగా పోలీసులు కలెక్టరేట్ వద్ద భారీగా మోహరించారు. నిరసనకారులను అడ్డుకునే క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో పరిస ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

