కలం, వెబ్ డెస్క్: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లెక్కలేనన్ని రెవెన్యూ సమస్యలు ఉన్నాయని సీఎం చంద్రబాబు (CM Chandrababu) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం సిద్ధాంతంలో “మీ భూమి – మీ హక్కు” సభకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి హాజరయ్యారు. సిద్ధాంతంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను (New Pattadar Passbooks) పంపిణీ చేశారు. గతంలో రైతు పట్టాదారు పాస్ పుస్తకంపై జగన్ ఫోటో ఉంటే.. ఇప్పుడు దాన్ని తీసేసి అధికారిక రాజముద్ర ఫోటోతో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యలు పరిష్కరించి నేడు రాష్ట్ర రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇస్తున్నామని చెప్పారు. ప్రజల భూమిపై సైకో జగన్ తన ఫోటో వేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మొదటినుంచి తనను, టీడీపీ పార్టీని ఆదరించిందని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా అంటే తనకు ప్రత్యకమైన అభిమానం ఉందని చెప్పారు. ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు.
ల్యాండ్ సర్వే పేరుతో గత వైసీపీ ప్రభుత్వం రైతుల మధ్య చిచ్చు పెట్టిందని సీఎం ఫైర్ అయ్యారు. తెలంగాణలో నిజాం పాలన కారణంగా భూ సమస్యలు ఎక్కువగా ఉండేవని చెప్పారు.ఏపీలో ముందు నుంచి భూ సమస్యలు చాలా తక్కువ అని అన్నారు. జగన్ ప్రభుత్వ విధ్వంసంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒక భాగమని అన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన భూ రికార్డ్ లను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారని ఆరోపించారు. ఎన్నికల ముందు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తగలబెట్టి రద్దు చేస్తామన్నామని.. చెప్పినట్టు చేశామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తున్నామని చెప్పారు. ప్రజా భవిష్యత్ బాగు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పారు.

