కలం, వెబ్ డెస్క్ : ఏపీ రైతంగానికి శుభవార్త అందుతోంది. కూటమి ప్రభుత్వం ‘పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ’ (Annadata Sukhibhava) పథకం నిధులను విడుదల చేసింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో శనివారం నిర్వహించిన ప్రజావేదిక సభ నుంచి సీఎం చంద్రబాబు బటన్ నొక్కి 2026 ఖరీఫ్ సీజన్ కు గానూ తొలివిడత నిధులను విడుదల చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 46.85 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ. 3,125 కోట్లు నిధులు జమ అయ్యాయి.
తొలి విడతలో భాగంగా ఒక్కొక్కరికీ రూ.7,000 ఆర్థిక సాయం అందుతోంది. ఈ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, కేంద్రం పీఎం కిసాన్ కింద రూ.2 వేలు కలిపి మొత్తం రూ.7 వేల చొప్పున జమ అవుతోంది. నేడు ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్లో 26వ విడతకు సంబంధించిన పీఎం కిసాన్ డబ్బులను రిలీజ్ చేసిన అనంతరం సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేశారు. కాగా, ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు విడతల్లో అందజేస్తున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.14 వేలు కాగా, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రూ.6 వేలు అందిస్తోంది.

