కలం, వెబ్ డెస్క్ : గత కొద్ది రోజులుగా విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి మాయం అయిన గాదె సాయికృష్ణ కేసు (Sai Krishna Missing Case) రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దూమారం రేపుతున్న సంగతి తెలిసిందే. సాయికృష్ణను చంపేశారని, దీనిని లాకప్ డేత్ గా పరిగణించాలని ప్రతిపక్ష వైసీపీ పార్టీ ఆరోపణలు గుప్పిస్తోంది. కొంతకాలంగా రాజకీయాల్లో స్తబ్దుగా ఉన్న వైసీపీ ఈ అంశంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ గాదె సాయికృష్ణ తల్లి, కుటుంబ సభ్యులను పరామర్శించడంతో ఈ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీంతో గత ఎన్నికల్లో జనాల్లో ఆదరణను పొగొట్టుకున్న వైసీపీకి ఈ అంశం ద్వారా పొలిటికల్ మైలేజ్ గ్రాఫ్ ను పెంచుకునే వీలు కలిగింది. అయితే సీఎం చంద్రబాబు తనదైన పాలన మార్క్ తో వైసీపీ దూకుడుకు చెక్ పెట్టారు. ప్రతిపక్ష పార్టీ ఊహించని విధంగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి సీఎం చంద్రబాబును కలవడంతో సీన్ రివర్స్ అయింది.
గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపిస్తామని సీఎం చంద్రబాబు అతని తల్లి విజయలక్ష్మికి సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆమె కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. తప్పు చేశారని తేలితే, ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో గాదె సాయికృష్ణ అదృశ్యం వ్యవహారంలో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం వచ్చిందని సాయికృష్ణ కుటుంబ సభ్యులు ప్రకటించారు.
ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతామని చంద్రబాబు హామీ ఇచ్చారని, దీని వెనుక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సాయికృష్ణ కుటుంబ సభ్యులు తెలిపారు. అంతేకాదు తమకు రాజకీయాలతో సంబంధం లేదని, న్యాయం జరగాలని మాత్రమే కోరుకున్నట్లు సాయికృష్ణ మేనమామ నవరంగ్ మీడియాకు వెల్లడించారు. ఈ అంశంలో దూకుడుకు ముందుకెళ్లి పొలిటికల్ మైలేజ్ పెంచుకుందాం అని చూసిన వైసీపీకి కుటుంబ సభ్యుల తాజా ప్రకటన బిగ్ షాక్ ను కలగజేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సీఎం చంద్రబాబు తనదైన పాలన మార్క్ తో ఈ అంశంలో వైసీపీ ఇకపై సైలెంట్ అయ్యేలా చేశారని అభిప్రాయపడుతున్నారు.

