కలం, వలిగొండ: జంట నగరాలతో పాటు మూసీ ఎగువ ప్రాంతాల్లో, మూసీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నదికి వరద నీరు (Musi River floods) పోటెత్తింది. దీంతో వలిగొండ (Valigonda) మండలంలోని సంగెం గ్రామం వద్దగల భీమలింగం కత్వ ఉప్పొంగింది. దీంతో సంగెం – బొల్లేపల్లి గ్రామాల మధ్య లోలెవెల్ కాజ్ వే పైనుండి భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ వరదలు దృష్టిలో పెట్టుకొని స్థానిక రెవిన్యూ, పోలీస్ శాఖ వారు తమ సిబ్బందితో కాజ్ వే వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి మూసీ వరదల పట్ల పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

