కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు (Manuguru) మండంలోని రేగుల గండి చెరువులో విద్యార్థి గల్లంతు అయ్యాడు. మండలంలోని శ్రీ విజ్ఞాన్ స్కూల్ లో నక్కా హర్ష వర్ధన్ అనే విద్యార్థి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో పాఠశాల ముగిసిన తర్వాత స్నేహితులతో కలిసి చెరువులో స్నానానికి వెళ్లిన హర్ష వర్ధన్ గల్లంతయ్యాడు. ఘటనతో పాఠశాల వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాగా ఒంటి పూట బడులు మధ్యాహ్నం వరకే అయినా, పదవ తరగతి ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నామని చెప్పిన యాజమాన్యం విద్యార్ధులను గాలికి వదిలేసిందని విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సీఐ నాగబాబు ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. మరోపక్క, నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యం పై తగు చర్యలు తీసుకోవాలని, తల్లితండ్రులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని విద్యార్ధి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

