కలం, వెబ్ డెస్క్ : మహా శివరాత్రి పర్వదినాన జాగరణ చేసేందుకు వెళ్లిన ఒక విద్యార్థిపై కొందరు యువకులు దాడి చేసిన ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట (Kothakota) మండలంలో చోటు చేసుకున్నది. కానాయపల్లి గ్రామ శివారులోని కోటి లింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఈ దారుణం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి భాను ప్రకాష్ శివరాత్రి వేడుకల కోసం స్థానిక ఆలయానికి వెళ్లాడు. అక్కడ ఉన్న ఒక టీ స్టాల్ వద్ద ఆగి ఉన్న బైక్ పై కూర్చుని టీ తాగుతున్న సమయంలో, కొందరు యువకులు అక్కడికి వచ్చి వాహనాన్ని పక్కకు తీయాలని అతనితో గొడవకు దిగారు. ఆ బైక్ తనది కాదని, తనకు సంబంధం లేదని భాను ప్రకాష్ చెబుతున్నా వినకుండా ఆ యువకులు రెచ్చిపోయారు. విచక్షణారహితంగా దాడి చేసి ఆ బాలుడిని తీవ్రంగా గాయపరిచారు.
యువకుల దాడిలో తీవ్ర గాయాలపాలైన భాను ప్రకాష్ను వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి, దర్యాప్తును వేగవంతం చేశారు.


