కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో జరుగుతున్న మైనింగ్ అక్రమాలపై సీఐడీ (CID) అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, మహబూబాబాద్ జిల్లాల్లో సోదాలు జరుపుతున్నారు. మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రధానంగా, గ్రానైట్ క్వారీల్లో అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నట్లు సీఐడీకి ఆధారాలు లభించినట్లు సమాచారం. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని ఉద్దేశపూర్వకంగా ఎగవేస్తూ.. ఖజానాకు రూ.వందల కోట్ల నష్టం చేస్తున్నట్లు గుర్తించాయి. చాలా జిల్లాల్లో అనుమతించిన ప్రదేశాల్లో కాకుండా మరో చోట తవ్వకాలు జరుపుతున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో అధికారులు పలు క్వారీలను స్వయంగా సందర్శించి అనుమతిపత్రాలను తీసుకున్నారు.
ఓ వైపు ఈడీ, మరోవైపు సీఐడీ
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ అక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నాయనేది పర్యావరణవేత్తలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. రూ.వందల కోట్లు జీఎస్టీ ఎగవేసి, ఇతర చోట్లకు తరలించిన వైనంపై ఇప్పటికే ఈడీ రంగంలోకి దిగి విచారణ జరుపుతోంది. ఇప్పుడు సీఐడీ కూడా సోదాలు చేస్తుండటంతో ఆసక్తికరంగా మారింది. ఆరు నెలల్లోగా విచారణ నివేదిక ప్రభుత్వానికి అప్పగించనున్నట్లు సమాచారం.

