కలం, నకిరేకల్: తెలంగాణ ఉద్యమకారులను గత ప్రభుత్వం విస్మరించిందంటూ ఇటీవల ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “తెలంగాణ ఉద్యమకారులను మర్చిపోయారని మాట్లాడే ముందు మీ ఇంటి సంగతి ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి” అంటూ వీరేశంపై మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారుల కోటాలోనే మీ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని, ప్రస్తుతం ఆమె నెలకు రూ.32,200 జీతం తీసుకుంటున్న విషయాన్ని ఎలా మర్చిపోతారని ప్రశ్నించారు. ఉద్యమ ఫలాలను అనుభవిస్తూనే అదే ఉద్యమకారులను విస్మరించారని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
అంతేకాకుండా వీరేశం భార్య పుష్ప కేవలం పాటలు పాడటానికే పరిమితం కాకుండా రాజకీయ కోణంలో మీటింగ్లు ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని లింగయ్య నిలదీశారు. దళితుల పట్ల ప్రస్తుత ప్రభుత్వానికి, వీరేశానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో గత రెండున్నర ఏళ్ల కాలంలోనే తేలిపోయిందని విమర్శించారు. “రెండున్నర సంవత్సరాల కాలంలో బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి సంకెళ్లు వేస్తే మీరేం చేశారు? అప్పుడు మీ చిత్తశుద్ధి ఎటు పోయింది?” అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతోనే ప్రభుత్వం లొంగిపోయిందని వారు గుర్తు చేశారు. “అంబేద్కర్ విగ్రహానికి వేసిన సంకెళ్లను వెంటనే తొలగించి, మహనీయుడికి నిజమైన నివాళులు అర్పించాలని కేటీఆర్ గళమెత్తడంతోనే ఈ ప్రభుత్వానికి భయం పట్టుకుంది” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో దళితుల ఆర్థికాభివృద్ధి కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. దాదాపుగా రూ.4,300 కోట్ల నిధులతో లక్షా 30 వేల మంది దళిత కుటుంబాలకు ‘దళితబంధు’ పథకాన్ని అందించి ఆర్థికంగా నిలబెట్టామని స్పష్టం చేశారు. “ఎన్నికల సమయంలో దళితబంధు కింద రూ.10 లక్షలు కాదు, రూ.12 లక్షలు ఇస్తామని పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికారు. మరి అధికారం లోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా.. ఈ రోజు వరకు ఏ ఒక్కరికైనా దళితబంధు ఇచ్చారా? దీనికి వీరేశం సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు. దళిత ద్రోహులు ఎవరో, దళితుల పక్షపాతులు ఎవరో ప్రజలందరికీ స్పష్టంగా తెలుసని, తప్పుడు విమర్శలు చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

