కలం, మహబూబ్నగర్ బ్యూరో : స్త్రీల మనుగడకు గొడ్డలి పెట్టు లాంటి మనువాద భావజాలాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలని ఎన్ఎఫ్ఐడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి పొందికంటి పద్మావతి పిలుపునిచ్చారు. భారత జాతీయ మహిళా సమాఖ్య (NFIW) 72వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రంలోని సురవరం వెంకట్రామిరెడ్డి భవన్ ఎదుట గురువారం జెండా ఆవిష్కరణ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కె. పద్మావతి మాట్లాడుతూ.. సమాజంలోని సాంఘిక దురాచారాలను రూపుమాపడంలో భారత జాతీయ మహిళా సమాఖ్య ఎనలేని కృషి చేసిందని అన్నారు. అరుణ అసఫ్ అలీ, గీతా ముఖర్జీ, రేణు చక్రవర్తి వంటి నేతల కృషి ఫలితంగా చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అంశం ముందుకు వచ్చిందని తెలిపారు. వరకట్న నిషేధ చట్టం, గృహహింస చట్టం, మహిళల ఆస్తి హక్కు, విద్య, వైద్యం, ప్రసూతి సెలవులు, పని ప్రదేశాలలో రక్షణ, సమాన పనికి సమాన వేతనం వంటి హక్కుల సాధనకు మహిళా సమాఖ్య చేసిన పోరాటాలు కీలకమని ఆమె పేర్కొన్నారు. మహిళలను కేవలం గృహపరిమితికి పరిమితం చేసిన పరిస్థితుల నుంచి బయటకు తీసుకువచ్చి అక్షరాస్యత, చైతన్యం పెంపొందించడంలో సమాఖ్య పాత్ర గొప్పదని అన్నారు.
నేటి డిజిటల్ యుగంలో కూడా మహిళలపై దాడులు, అన్యాయాలు, ఆకృత్యాలు కొనసాగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలని, సామాన్యులకు ఒక తీరు, రాజకీయ నాయకులకు మరో తీరు ఉండకూడదని ఆమె అన్నారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి. సురేష్ మాట్లాడుతూ మహిళల పోరాటాలు దేశవ్యాప్తంగా విజయవంతం కావాలని, స్వాతంత్ర సంగ్రామం నుండి నేటి వరకు అన్ని ఉద్యమాలలో మహిళల పాత్ర కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యు జిల్లా కమిటీ సభ్యులు అరుణ, పద్మ, భవాని, అంజమ్మ, సత్యమ్మ, లక్ష్మి, మాధవి తదితరులు పాల్గొన్నారు.
Read Also: ఇండోనేషియా ఓపెన్లో సింధు, ఆయుష్ ఔట్
Follow Us On: Instagram

