కలం, మెదక్ బ్యూరో: బాలలు సురక్షితంగా, ఆరోగ్యంగా ఎదగడానికి అవసరమైన అన్ని హక్కులను (Child Rights) కాపాడటం ప్రతిఒక్కరి బాధ్యత అని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ సీతా దయాకర్ రెడ్డి (Seetha Dayakar Reddy) అన్నారు. బాలల హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా, ఎలాంటి ఒత్తిళ్లకు గురిచేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెదక్ కలెక్టరేట్లో ఉమ్మడి మెదక్ జిల్లా శాఖల అధికారులతో చైర్ పర్సన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, డ్రగ్స్ నియంత్రణ, కిషోర బాలికల ఆరోగ్య అవగాహన, పాఠశాలల్లో డ్రాప్ ఔట్ తగ్గించడం, మరుగుదొడ్ల నిర్మాణాలు, ఫుడ్ పాయిజన్, సాధారణ ప్రసవాలు, పోక్సో కేసుల లాంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చిన్నారులు సమాజానికి దిక్సూచీలు అని, శారీరక, భావోద్వేగ వికాసానికి అనుకూల వాతావరణం కల్పించడం అవసరమన్నారు. కొంతమంది బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ బాలలపై దౌర్జన్యాలు, బాల కార్మికత్వం, బాల్య వివాహాలు, విద్యా హక్కుల నిర్లక్ష్యం లాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో బాల్యానికి సరైన భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
Read Also: తెలంగాణకు ప్రధాని మోదీ.. ఇదే పూర్తి షెడ్యూల్!
Follow Us On: WhatsApp

