కలం, కరీంనగర్ బ్యూరో: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవాలను పురస్కరించుకుని “బాల్య వివాహ రహిత తెలంగాణ” అనే కార్యక్రమాన్ని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మానకొండూరు మండలం అన్నారం (Annaram) గ్రామపంచాయతీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “బాల్య వివాహం-బతుకు ఆగం” అనే నినాదంతో, అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండేంత వరకు వివాహం చేయడం బాల్య వివాహ నిరోధక చట్టం-2006 ప్రకారం నేరమని అన్నారు. ఎవరైనా బాల్య వివాహాన్ని ప్రోత్సహించినా, జరిపించినా శిక్షార్హులవుతారని, ఎవరికైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిస్తే చైల్డ్ హెల్ప్లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1098 కి సమాచారం ఇవ్వాలని సూచించారు. బాల్య వివాహాలు పిల్లల విద్య, ఆరోగ్యం, భద్రత, భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు. బాల్య వివాహ రహిత తెలంగాణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో భాగంగా గ్రామ పరిధిలో బాల్య వివాహ నిరోధం, నిర్మూలనకు సంబంధించిన తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, సిడిపిఓ, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సూపర్వైజర్, చైల్డ్ హెల్ప్లైన్ 1098 కోఆర్డినేటర్, DHEW జెండర్ స్పెషలిస్ట్, సఖీ పారామెడికల్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

