కలం, వరంగల్ బ్యూరో: పాముకాటుతో చిన్నారి మృతిచెందిన విషాద ఘటన వరంగల్ (Warangal) జిల్లా నెక్కొండ మండలంలోని భూక్యాతండాలో బుధవారం జరిగింది. తండాకు చెందిన లావుడ్య తిరుపతి, సుజాత దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె లావుడియా కుట్టి (3) ఇంటిముందు ఆడుకుంటూ స్నానాల గదిలోకి వెళ్ళింది. అప్పటికే స్నానాల గదిలో ఉన్న నాగుపాము చిన్నారిని కాటేసింది (Snake Bite). చిన్నారి గుక్కపట్టి ఏడుస్తుండటంతో తల్లిదండ్రులు పాపకు దెబ్బ తగిలిందని భావించి ఏడుపు ఆపేందుకు ప్రయత్నించారు.
కొద్దిసేపు తర్వాత పాప నోటి నుంచి నురుగు రావడంతో స్నానాల గది వైపు వెళ్లి చూడగా నాగుపాము కనిపించింది. తల్లిదండ్రులు వెంటనే పాపను ఆస్పత్రికి తీసుకెళ్తున్నక్రమంలో మార్గమధ్యలో మృతిచెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. చిన్నారి మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

