కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట జిల్లా చేర్యాల (Cheriyal) మున్సిపాలిటీ పరిధిలోని పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్ పరిధిలో మొత్తం ఆరు పెట్రోల్ బంకులు ఉండగా, ఐదు బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు లేకపోవడంతో యాజమాన్యాలు వాటిని మూసివేశాయి. కేవలం ఒక్క బంకులో మాత్రమే ఇంధనం అందుబాటులో ఉండటంతో వాహనదారులు అక్కడికి భారీగా తరలివచ్చారు. దీనివల్ల ఆ బంకు వద్ద వాహనాల క్యూ లైన్లు భారీగా పెరిగిపోయాయి. ఉదయం వేళల్లో వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లే ప్రజలు ఇంధనం కోసం బంకుల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

