కలం, వెబ్ డెస్క్: గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) చతికిలబడింది. బ్యాటర్లంతా ఫెయిల్ కాగా చివరి వరకు టేలెండర్ ఓవర్టన్ ఒంటరి పోరాటం చేసి జట్టుకు పర్వాలేదు అనే స్కోర్ అందించాడు. టీమ్లో అత్యధిక స్కోర్ చేసిన ప్లేయర్ కూడా అతడే కావడం విశేషం. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల ధాటికి పేకమేడలా కూలిపోయింది చెన్నై బ్యాటింగ్ లైనప్. పవర్ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోయిన సీఎస్కే, నిర్ణీత 19.4 ఓవర్లలో కేవలం 127 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.
ఆరంభం నుంచే రాజస్థాన్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో చెన్నై బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. స్టార్ బ్యాటర్లు సంజూ శాంసన్ (6), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (6), మాథ్యూ షార్ట్ (2) డకౌట్గా వెనుదిరిగిన ఆయుష్ మ्हाత్రే ఇలా వరుసగా క్యూ కట్టడంతో చెన్నై ఒక దశలో భారీ స్కోరు చేసే అవకాశాన్ని పూర్తిగా కోల్పోయింది. మిడిల్ ఆర్డర్లో సర్ఫరాజ్ ఖాన్ (17), కార్తీక్ శర్మ (18) కాసేపు ప్రతిఘటించినా, రాజస్థాన్ స్పిన్ మాయాజాలం ముందు నిలవలేకపోయారు. చివర్లో జామీ ఓవర్టన్ (43 పరుగులు, 36 బంతుల్లో) ఒంటరి పోరాటం చేయడంతో చెన్నై గౌరవప్రదమైన స్కోరైనా సాధించగలిగింది.
రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ తన 4 ఓవర్లలో కేవలం 19 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బకొట్టగా, నాండ్రే బర్గర్, రవీంద్ర జడేజా కూడా తలో రెండు వికెట్లతో చెన్నై నడ్డి విరిచారు. బ్రిజేష్ శర్మ, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీసి తమ వంతు సహకారాన్ని అందించారు. రాజస్థాన్ ఫీల్డర్లు కూడా అద్భుతమైన క్యాచ్లు, రనౌట్లతో చెన్నైకి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు 128 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగుతున్న రాజస్థాన్ రాయల్స్ను చెన్నై బౌలర్లు అడ్డుకోగలరా లేక రాజస్థాన్ బ్యాటర్లు ఈజీగా గెలిపిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

