కలం, వరంగల్ బ్యూరో: హనమకొండ (Hanumakonda) సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలకు (IDOC) సంబంధించిన పన్ను బకాయి రూ. 85,61,262 మొత్తానికి చెక్ను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్(Chahat Bajpai) సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో జీడబ్ల్యూఎంసీ (బల్దియా) అధికారులకు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నగర పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు తమకు ఉన్న పన్ను బకాయిలను వెంటనే చెల్లించి బల్దియాకు సహకరించాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపుకు కేవలం ఒక రోజు మాత్రమే మిగిలిన నేపథ్యంలో, మార్చి 31 అర్ధరాత్రి వరకు బల్దియా సేవా కేంద్రాలు నగరవ్యాప్తంగా పనిచేస్తాయని వెల్లడించారు.
నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. ఆస్తి పన్ను, నీటి పన్ను, ఇతర బకాయిలను సమయానికి చెల్లించి, నగర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఎంహెచ్ఓ డా. రాజారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు (అడ్మిన్) సమ్మయ్య, బిర్రు శ్రీనివాస్, ఆర్ఐ అనిల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

