కలం, వెబ్ డెస్క్: పర్యావరణ పరిరక్షణలో చెన్నై (Chennai) మరో అడుగు ముందుకు వేసింది. చెన్నైలోని మెరీనా బీచ్ (Marina Beach)కు వచ్చే సందర్శకులు ఇకపై ప్లాస్టిక్ బాటిళ్లను ఎక్కడపడితే అక్కడ పారేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఏర్పాటు చేసిన ‘స్మార్ట్ రీసైక్లింగ్ మిషీన్’లో వాడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను వేస్తే చాలు.. వెంటనే అందులో నుంచి పర్యావరణ హితమైన క్యారీ బ్యాగ్స్ బయటకు వస్తాయి. చెన్నైలోని మెరీనా బీచ్ భారత్లో అత్యంత పొడవైన బీచ్గా ప్రసిద్ధి చెందింది. ఇది సుమారు 13 కిలో మీటర్ల పొడవు ఉంటుంది. రోజూ ఇక్కడికి వేలాది సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. నిత్యం పర్యాటలకు వేస్తున్న వ్యర్థాలు బీచ్ శుభ్రతకు సవాలుగా మారాయి. దీంతో ఈ స్మార్ట్ మిషీన్లను ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ రహిత సమాజం దిశగా వేసిన ఈ చిన్న అడుగు, కాలుష్యాన్ని తగ్గించడంలో పెద్ద మార్పుకు శ్రీకారం చుడుతోంది. ఇలాంటి వినూత్న పద్ధతులను దేశంలోని అన్ని నగరాలు అందిపుచ్చుకుంటే, మన పర్యావరణం మరింత అందంగా మారుతుందని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు.

