కలం, వెబ్ డెస్క్: తెలుగు వారికి గుర్తింపు లేని రోజుల్లో మన సత్తా చాటిన మహనీయుడు పొట్టి శ్రీరాములు (Potti Sriramulu) అని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) కొనియాడారు. ఆయన చేసిన 58 రోజుల నిరాహారదీక్షకు గుర్తుగా 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. అమరావతి శాఖమూరు పార్కులో ఏర్పాటు చేసిన 58 అడుగుల శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు తెలుగు జాతికి చేసిన సేవలను స్మరించుకున్నారు. కేవలం రాష్ట్రం కోసమే కాకుండా, దళితులకు ఆలయ ప్రవేశం కోసం కూడా ఆయన 29 రోజుల పాటు పోరాడారని గుర్తు చేశారు. 2019-24 మధ్య రాజధానిని మూడు ముక్కలాటగా మార్చి, అసలు రాజధానే లేని పరిస్థితి తెచ్చారని గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
ఇప్పుడు అమరావతి మళ్లీ ప్రజా రాజధానిగా అభివృద్ధి చెందుతోందని, రాజధాని అభివృద్ధి రాష్ట్రాభివృద్ధికి కేంద్ర బిందువని వ్యాఖ్యానించారు. తెలుగు జాతి వివిధ సమయాల్లో విడిపోయి, వివిధ సందర్భాల్లో కలిసి ఉందని చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఇప్పుడు తెలుగు జాతికి రెండు రాష్ట్రాలున్నాయని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ ను అభివృద్ధి దిశగా సాగేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, నారాయణ, సవిత, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎమ్మెల్యేలు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, నేతలు పాల్గొన్నారు.
Read Also: నిన్న డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్.. నేడు లోక్సభలో ప్రత్యక్షం!
Follow Us On : WhatsApp

