కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రేపు హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. జూన్ 9 వ తేదీతో మూడో దఫా మోదీ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి పార్టీల సమావేశం జరగనుంది. జూన్ 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పాల్గొననున్నారు.
ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లోని పాలన తీరుతో పాటు కేంద్రప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్రాలతో సమన్వయం వంటి తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జూన్ 15 తర్వాత కేంద్ర మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ రాష్ట్ర అభివృద్ధిపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. పెండింగ్ బిల్లులు, ప్రాజెక్టుల నిర్మాణాలకు, రాష్ట్రానికి ఇచ్చిన వాగ్ధానాలకు సంబంధించిన అంశాన్ని కేంద్రంతో చర్చించే చాన్స్ ఉంది.

