కలం, నిర్మల్: వర్షాకాలంలో ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భైంసా ఎమ్మెల్యే పవార్ రామా రావ్ పటేల్ (MLA Pawar Rama Rao Patel) వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం భైంసా ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాకాలంలో అత్యవసర వైద్య సేవల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు.
అనంతరం ఒక్కో వైద్యుడిని పిలిచి వారి విభాగాలకు అవసరమైన సౌకర్యాలు, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భైంసా ఏరియా ఆసుపత్రిని ప్రస్తుతం ఉన్న 100 పడకల నుంచి 150 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
అలాగే కుభీర్ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయడంతో పాటు భైంసాలో ప్రత్యేక మాతా-శిశు ఆసుపత్రి ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ అజ్మీరా సాంకేత్ కుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్, మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తాత్రి, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

