కలం, వెబ్ డెస్క్ : యూరోపియన్ ఫుట్బాల్ ఛాంపియన్స్ లీగ్ ఫైనల్లో ఆర్సెనల్పై పీఎస్జీ ఘన విజయం సాధించింది. ఈ చారిత్రాత్మక విజయంతో పారిస్ నగరంలో అభిమానుల సంబరాలు ఒక్కసారిగా మిన్నంటాయి. పార్క్ డెస్ ప్రిన్సెస్, చాంప్స్ ఎలిసీస్ పరిసరాల్లో వేలాది మంది గుమిగూడి పండగ చేసుకున్నారు. అయితే ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. కొంతమంది ఆకతాయిలు విజయోత్సవాల పేరుతో పారిస్ వీధుల్లో అరాచకం (Paris Riots) సృష్టించారు.
రోడ్లపై ఉన్న వాహనాలకు నిప్పు పెట్టడమే కాకుండా పోలీసులపైకి బాణాసంచా విసిరారు. రహదారులకు అడ్డంగా బారికేడ్లు వేసి తగలబెట్టారు. ఈఫిల్ టవర్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి పూర్తిగా ఉద్రిక్తంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన సుమారు 8,000 మందికి పైగా పోలీసులు అల్లరి మూకలను అదుపు చేయడానికి టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ హింసాత్మక ఘటనలకు కారణమైన 280 మందిని రాత్రికి రాత్రే అరెస్ట్ చేశారు. నగరంలో శాంతిభద్రతలను కాపాడటానికి అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. మెట్రో స్టేషన్లు, ట్రామ్ లైన్లు, బస్సుల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. పీఎస్జీ సాధించిన అద్భుత విజయాన్ని ఎంజాయ్ చేయాల్సింది పోయి, ఇలాంటి వినాశకర చర్యలకు దిగడంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

