కలం, వెబ్ డెస్క్: దేశంలోకి విలువైన లోహాల దిగుమతులను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై భారీగా దిగుమతి సుంకం పెంచిన కొద్ది రోజుల్లోనే శనివారం వెండి దిగుమతుల (Silver Imports)పై కేంద్రం అదనపు ఆంక్షలు విధించింది. ఇప్పటి వరకు ఎటువంటి ప్రత్యేక పర్మిట్లు లేకుండా స్వేచ్ఛగా సాగుతున్న వెండి దిగుమతుల విధానాన్ని సవరిస్తూ దానిని తక్షణమే తీసుకు వచ్చేలా నియంత్రిత కేటగిరీలోకి మారుస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అధికారిక నోటిఫికేషన్లో స్పష్టం చేసింది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం సాధారణ వెండితో పాటు బంగారం, ప్లాటినమ్ పూత పూసిన వెండి వస్తువుల దిగుమతులకు కూడా ఆంక్షలు వర్తిస్తాయి. ఏదైనా వస్తువును నియంత్రిత కేటగిరీలో చేర్చినప్పుడు, దానిని ఇతర దేశాల నుంచి భారత్లోకి దిగుమతి చేసుకోవాలంటే వ్యాపారులు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక లైసెన్స్ లేదా అనుమతి పొందాల్సి ఉంటుంది. అంతకు ముందు మే 13 తేదీన కేంద్ర ప్రభుత్వం విలువైన లోహాల దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి ఏకంగా 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా దిగుమతులపై ఆంక్షలు కూడా విధించడంతో దేశీయ మార్కెట్లో వెండి లభ్యత, ధరలపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది.

