కలం, వెబ్ డెస్క్: టెలిగ్రామ్ (Telegram) యాప్పై కేంద్రం మరింత దృష్టి పెట్టింది. సినిమాలు పైరసీ జరగడంతో పాటు ఓటీటీల కంటెంట్ కాపీ యథేచ్ఛగా జరగుతోందని, దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని కేంద్ర ఎలక్ట్రానిక్, సమాచార మంత్రిత్వ శాఖ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ 15 రోజుల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ATR) కూడా సమర్పించాలని సూచించింది.
ప్రధానంగా మూడు అంశాలపై..
టెలిగ్రామ్ వేదికగా జరుగుతున్న మూడు ప్రధాన అంశాలను గుర్తించి నోటీసులు జారీ చేసింది. మొదటగా కంటెంట్ పైరసీకి పాల్పడుతున్న ఛానెల్స్, గ్రూపులను వెంటనే తొలగించాలి. రెండోది, వివిధ గ్రూపుల్లో షేర్ అవుతున్న పైరసీ సినిమాలు, ఓటీటీ నుంచి చోరీ చేసిన కంటెంట్ను తక్షణమే నిలిపివేయాలి. మూడోది, ఇక నుంచి కాపీ రైట్ జరగకుండా ఉండేందుకు అవసరమైన వ్యవస్థలను రూపొందించి కఠినంగా అమలు చేయడం.
3 వేల పైరసీ ఛానెల్స్ గుర్తింపు..
ఇప్పటివరకు సుమారు 3 వేల పైరసీ ఛానెల్స్ గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. చిత్ర పరిశ్రమ, నిర్మాతలు, ఓటీటీ ప్లాట్ఫారాలు, సినిమా డిస్ట్రిబ్యూటర్లు సహా ఈ రంగంలో పనిచేస్తున్నవారి క్రియేటివిటీ కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోటీసుల్లో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం క్రియేటర్ ఎకానమీ రక్షణకు కట్టుబడి ఉంటుందని అందులో స్పష్టం చేసింది.
ఐటీ రూల్స్ పాటించాల్సిందే..
టెలిగ్రామ్ సహా ఎవరైనా సరే ఐటీ చట్టం–2000, ఐటీ నిబంధనలు–2001ను పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. తమ నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు ఎదురు చూడొద్దని, ఇలాంటి క్రియేటివిటీ పరమైన అంశాల్లో సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకుని, నిరంతరం నిఘా పెట్టాలని ఆదేశించింది.

