కలం, నిజామాబాద్ బ్యూరో : శాంతిభద్రతల పరిరక్షణకు నిఘా వ్యవస్థను పటిష్ట పరచాలని డీఐజీ భాస్కరన్ (DIG Bhaskaran) అధికారులకు సూచించారు. బాసర జోన్ 2 పరిధిలోని నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లా స్థాయి అధికారులతో శనివారం నిజామాబాద్ సీపీ ఆఫీస్ లో డీఐజీ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రేంజ్ పరిధిలోని జిల్లాల శాంతిభద్రతల పరిస్థితి, నేర నియంత్రణ, పోలీసు సేవలు, పెండింగ్ కేసుల దర్యాప్తు, మహిళలు చిన్నారుల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, మాదక ద్రవ్యాల నిర్మూలన, కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై విస్తృతంగా సమీక్షించారు.
సమావేశంలో జిల్లాల వారీగా నమోదవుతున్న నేరాల తీరు , వాటి విచారణలో సాధించిన పురోగతి , నేరస్తులపై తీసుకుంటున్న చర్యలు , వారెంట్ల అమలు , రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల పర్యవేక్షణ , శాంతిభద్రతలకు భంగం కలిగించే అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు.
ఈ సందర్భంగా డీజీజీ మాట్లాడుతూ.. ప్రజల ఫిర్యాదులను సకాలంలో స్వీకరించి , పారదర్శకంగా విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి సైబర్ నేరాలను అరికట్టాలన్నారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల కేసుల్లో వేగవంతమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు , వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు యువతలో అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండే స్నేహపూర్వక పోలీసింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలని , ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి పోలీసు శాఖపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా పనిచేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, నిర్మల్ జిల్లా ఎస్పీ జి. జానకి షర్మిల, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, అదనపు ఎస్పీలు, ఏసీపీలు, సిఐలు, రిజర్వ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.

