కలం, వెబ్ డెస్క్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2026 సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి (సెషన్ 1) బోర్డు పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం ఉత్తీర్ణత శాతం 93.70గా నమోదైనట్లు తెలిపింది. అధికారిక గణాంకాల ప్రకారం అమ్మాయిలు అబ్బాయిల కంటే మెరుగైన ఫలితాలు సాధించారు. అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 94.99గా ఉండగా.. అబ్బాయిల ఉత్తీర్ణత శాతం 92.6గా నమోదైంది. ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు జరిగిన ఈ పరీక్షలకు దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు హాజరైనట్లు బోర్డు తెలిపింది. విద్యార్థులు తమ ఫలితాలను CBSE అధికారిక వెబ్సైట్లు cbse.gov.in, results.cbse.nic.in ద్వారా తెలుసుకోవచ్చని సూచించింది. అదనంగా UMANG యాప్, DigiLocker ద్వారా కూడా మార్కులు చెక్ చేసుకోవచ్చని CBSE తెలిపింది. ప్రత్యేకంగా DigiLocker ద్వారా డిజిటల్ మార్క్ షీట్లు త్వరగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఫలితాలను తెలుసుకోవడానికి విద్యార్థులు రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ (DOB), సెక్యూరిటీ పిన్ వంటి వివరాలు నమోదు చేయాలని సూచించింది. ఇవి కాకుండా, ఫలితాలను SMS, IVRS సేవల ద్వారా కూడా పొందవచ్చని CBSE తెలిపింది.

