కలం, వెబ్ డెస్క్: కడప జిల్లా తెలుగు దేశం పార్టీ (Kadapa TDP)లో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. సీనియర్ టీడీపీ నేతలకు, వైసీపీ నుంచి వలస వచ్చిన నేతలకు మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కర్రలతో దాడులు చేసుకునే స్థాయికి చేరుకున్నాయి. 4వ డివిజన్ పరిధిలో జరుగుతున్న ఈ వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారింది.
4వ డివిజన్ పరిధిలో పాత టీడీపీ నేతలకు, వైసీపీ నుంచి వచ్చిన వలస నేతలకు మధ్య గురువారం రాత్రి తీవ్ర ఘర్షణ జరిగింది. కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో టీడీపీ డివిజన్ ఇంచార్జి ఆవుల వెంకటేష్కు తీవ్ర గాయాలయ్యాయి. తనపై మూకుమ్మడిగా 20 మందికి పైగా దాడి చేసినట్లు వెంకటేష్ ఆరోపిస్తున్నారు. ఒర్సు బాలకొండయ్య ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమైంది. ఈ వెంకటేష్తో మాట్లాడుకుందామని పిలిచి 20 మంది కర్రలతో దాడి చేసినట్లు ఆయన ఆరోపిస్తున్నారు. ఈ ఘర్షణల వ్యవహారం స్థానిక టీడీపీ పెద్దల వరకు చేరినట్లు సమాచారం.

