ఖమ్మం జిల్లాలో ఉధృతంగా ఆర్టీసీ సమ్మె

కలం, ఖమ్మం బ్యూరో : ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో ఆర్టీసీ సమ్మె(RTC Strike) ప్రభావం తీవ్రంగా కొనసాగుతోంది. జిల్లాలోని ఆరు ఆర్టీసీ డిపోల పరిధిలో సుమారు 650 బస్సులు అర్ధరాత్రి నుంచి డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో రవాణా సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. తెల్లవారుజామునుంచే కార్మికులు ఖమ్మం, కొత్తగూడెం, మధిర, భద్రాచలం, సత్తుపల్లి, మణుగూరు డిపోల ఎదుట భారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మొత్తం 1985 మంది కార్మికులు ఆందోళనలో పాల్గొన్నట్లు సమాచారం. చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని జేఏసీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. ఆర్టీసీ సమ్మెకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

ఆర్టీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ట్రేడ్ యూనియన్ ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఆగిపోయిన రెండు వేతన సవరణలను తక్షణమే అమలు చేయాలని, కొత్త బస్సులను కొనుగోలు చేసి ప్రయాణికుల సౌకర్యం మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరారు. మహాలక్ష్మి పథకం విజయవంతంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర కీలకమని జేఏసీ నేతలు గుర్తు చేశారు. గతంలో ఆర్టీసీ కార్మికుల ఆగ్రహానికి గురైన ప్రభుత్వాలు అధోగతి పాలయ్యాయని హెచ్చరిస్తూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>