కలం, కోదాడ : సూర్యాపేట జిల్లా కోదాడలోని కిట్స్ (Kodad KITS) ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం ఉదయం కలకలం రేగింది. కళాశాల భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న మైనా అనే విద్యార్థిని శనివారం ఉదయం భవనం పైనుంచి కిందకు దూకేసింది. తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితురాలిని గమనించిన తోటి విద్యార్థులు వెంటనే కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. సదరు విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండటంతో, ఆమెను మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనకు కళాశాల యాజమాన్యం వేధింపులే ప్రధాన కారణమని విద్యార్థి సంఘాలు, తోటి విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా కళాశాల నిర్వాహకుల ఒత్తిడి కారణంగానే ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ ఘటన బయటకు పొక్కకుండా కళాశాల నిర్వాహకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం విద్యార్థిని ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

