కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లలో మేయర్ల ఎన్నికకు సమయం ఆసన్నమైంది. రాజకీయ పార్టీలు తమ ఎత్తుగడలతో మేయర్ పీఠాలు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్లో (Karimnagar Corporation) నెలకొన్న పరిస్థితులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మేయర్ సీటు కోసం బీజేపీ, కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. బీఆర్ఎస్(BRS) అభ్యర్థుల సహకారంతో మేయర్ సీటు దక్కించుకోవాలనుకున్న కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ మేయర్ ఎన్నికలో పాల్గొనవద్దని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కరీంనగర్లో (Karimnagar) 66 డివిజన్లు ఉండగా బీజేపీ 30 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 14, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3, స్వతంత్ర అభ్యర్థులు 10 మంది గెలుపొందారు. ఎంఐఎం, బీఆర్ఎస్ మద్దతుతో మేయర్ పీఠం దక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేసింది. కొందరు స్వతంత్ర అభ్యర్థులు బీజేపీలో చేరినట్లు వార్తలు వచ్చాయి. పూట పూటకూ పరిస్థితులు మారుతూనే ఉన్నాయి. మేయర్ పీఠం మాదంటే మాదంటూ ఆయా పార్టీల నేతలు మీడియా ముందు ప్రకటించుకున్నారు. ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ పార్టీ మేయర్ ఎన్నికలో పాల్గొనకపోతే కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ ఖాతాలో పడినట్లే. మేయర్ ఎన్నికకు కొద్ది సమయమే ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
Read Also: ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ‘టగ్ ఆఫ్ వార్’.. పై చేయి ఎవరిది?
Follow Us On: X(Twitter)


