కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ (Palwancha) శ్రీనివాసగిరిలో కొలువైన శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లేందుకు రోడ్డు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆ పార్టీ ఎంపీల ప్రత్యేక నిధుల నుంచి కోటి 50 లక్షల రూపాయలు అందజేస్తామని హామీనిచ్చారు. ఆదివారం పాల్వంచ (Palwancha)లో జరిగిన స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీవెంకటేశ్వర స్వామి గుడిని సందర్శించే భక్తుల సౌకర్యార్థం తనతో పాటు బీఆర్ఎస్ ఎంపీలు డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, దీవకొండ దామోదర్ రావుల ప్రత్యేక నిధుల నుంచి 50 లక్షల చొప్పున మొత్తం కోటిన్నర రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అవసరమయితే మరో 50 లక్షల రూపాయలు కూడా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అనంతరం ఆలయ కమిటీ ప్రముఖులు, అర్చకులు ఎంపీ రవిచంద్ర, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు రాఘవ, తదితరులు సాదర స్వాగతం పలికారు. వేద పండితులు వారికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.

