కలం, వెబ్ డెస్క్ : మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2026 (IPL 2026) సందడి మొదలుకానున్న వేళ ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు మెంటార్ గా ఉన్న ఇంగ్లాండ్ మాజీ దిగ్గజ బ్యాటర్ కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen) అనుహ్య నిర్ణయం తీసుకున్నారు. తాను ఈ సీజన్ (IPL 2026) లో ఢిల్లీ క్యాపిటల్స్ మెంటారుగా వ్యవహరించడం లేదని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. మెంటార్ బాధ్యతలకు కేటాయించాల్సిన సమయం ప్రస్తుతం తన వద్ద లేదని. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే మెంటార్గా జట్టు పక్కన ఉండకపోయినా, కామెంట్రీ బాక్స్లో కూర్చుని తన గొంతుతో అభిమానులను అలరిస్తానని చెప్పుకొచ్చారు.
ఇదిలాఉంటే కెవిన్ పీటర్సన్ తాజా నిర్ణయం వెనుక మరో ప్రధాన కారణం ఉందని సమాచారం అందుతోంది. ఇంగ్లిష్ జట్టు హెడ్ కోచ్ గా ఉండేందుకు పీటర్సన్ ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. బ్రెండన్ మెక్ కలమ్ నేతృత్వంలోని ఇంగ్లీష్ జట్టు ఇటీవల సత్ఫలితాలను రాబట్టలేకపోతుంది. దీంతో తాను ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బాధ్యతలను చేపట్టేందుకు సిద్ధం అని ఇంగ్లీష్ బోర్డు దగ్గర పీటర్సన్ చెప్పినట్లు వినికిడి. ఐపీఎల్ లో మెంటార్ గా కొనసాగితే ఇంగ్లాండ్ హెడ్ కోచ్ పదవి రావడం ఇబ్బందిగా మారుతుందని పీటర్సన్ భావిస్తున్నారట. అందుకే పీటర్సన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

