కలం, వెబ్ డెస్క్ : స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) దేవాదాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. తన అనుమతి లేకుండా తన పరిధిలోని దేవాదాయశాఖలో సమీక్ష నిర్వహించిన కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలంటూ ఆ శాఖ మత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ హైకమండ్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి సురేఖ లేఖకు స్పందిస్తూ ఆమెకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు.
తప్పు చేయనుప్పుడు తాను ఎందుకు వివరణ ఇవ్వాలని కడియం శ్రీహరి అన్నారు. జనగామలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ సమస్యలు చెప్పడం ఎమ్మెల్యేగా తన హక్కు అని.. తాను నిబంధనలు అతిక్రమించలేదని చెప్పారు. మొత్తం శాఖపై సమీక్ష చేసే అధికారం తనకు లేదని.. తన పరిధిలోని దేవాలయాల అభివృద్ధిపైనే అధికారులను కలిశానని స్పష్టం చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇద్దరు సీనియర్ నేతల మధ్య రాజుకున్న ఈ ‘సమీక్ష’ వివాదం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. ఈ వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎలా సద్దుమణిగిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

