కలం, వరంగల్ బ్యూరో: కాంగ్రెస్ నేతలు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నేరవేరే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సవాల్ (Dasyam Vinay Bhasker) విసిరారు. ఇటీవల వరంగల్ సభకు కేటీఆర్ రాక సందర్బంగా చోటుచేసుకున్న ఘర్షణలో అరెస్ట్ అయినవారు శుక్రవారం బెయిల్పై విడుదలయ్యారు. వారిని కలిసిన అనంతరం దాస్యం వినయ్ భాస్కర్ మీడియాతో మాట్లాడారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక, కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు.
కేటీఆర్ (KTR) రైతుల పక్షాన పోరాడేందుకు రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తే, అనేక ఇబ్బందులకు గురి చేసినట్లు ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా జీడబ్ల్యూఎంసీ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపడితే బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేయడం సిగ్గుచేటన్నారు. కేసుల పేరుతో బీఆర్ఎస్ నాయకులను చిత్రహింసలకు గురిచేయడం సరైంది కాదన్నారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదన్నారు. రైతుల కన్నీటితో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకు పోవడం ఖాయమని, మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని గుర్తుపెట్టుకోవాలని ఆయన పేర్కొన్నారు.

