కలం, మెదక్ బ్యూరో: సర్పంచ్ ఎన్నికలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో చిచ్చు పెట్టాయా? గెలిచిన సర్పంచుల సన్మానసభ వాయిదా పడటానికి కారణం నేతల మధ్య సఖ్యత లేకపోవడమేనా? పార్టీ అధినేత ఇలాఖాలో వర్గపోరు దేనికి సంకేతం? ఈ పరిస్ధితిని అనుకూలంగా మార్చుకొని అధికార పార్టీ బలం పెంచుకుంటున్నదా? గజ్వేల్ నియోజకవర్గ (Gajwel BRS) పరిస్థితులు చూస్తే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
కేసీఆర్ ఇలాఖా..
2014 వ సంవత్సరం నుంచి కేసీఆర్ ఈ నియోజకవర్గాన్ని తన ఇలాఖాగా ఎంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచే ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గవ్యాప్తంగా బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులే మెజార్టీ స్థానాల్లో గెలుపొందారు. మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి సమన్వయంతో పనిచేసి మెజార్టీ స్థానాల్లో సర్పంచ్లను గెలిపించుకున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో అధికారపార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చింది.
నేతల మధ్య వర్గ విబేధాలు
గజ్వేల్ నియోజకవర్గవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ మద్ధతుతో గెలిచిన సర్పంచులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని పార్టీ ప్లాన్ వేసింది. ఆ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్రావుని అతిథిగా ఆహ్వానించారు. ఆయన కూడా ఓ డేట్ ఫిక్స్ చేసుకున్నారు. నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆ కార్యక్రమ ఏర్పాట్లలో మొదలు పెట్టారు. కానీ ఈ సభ విషయంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి అలిగారు. సన్మానసభ గురించి కనీస సమాచారం ఇవ్వకపోవడమే కారణమని తెలుస్తోంది. విషయం మాజీ మంత్రి హరీశ్ రావుకు తెలియడంతో ఆయన కార్యక్రమాన్ని వాయిదా వేయాలని వంటేరుని ఆదేశించడంతో సన్మాన కార్యక్రమం వాయిదా పడిందని సమాచారం.
పార్టీ ఫండ్ విషయంలోనూ గొడవ
ఎన్నికల ముందు వచ్చిన పార్టీ ఫండ్ విషయంలోనూ ఇద్దరికీ గొడవ జరిగిందని సమాచారం. పార్టీ ఫండ్ వంటేరు తన అనుచరులకే మాత్రమే ఇప్పించుకున్నారని.. తన అనుచరులకు ఇవ్వలేదని యాదవరెడ్డి గుస్సాగా ఉన్నట్టు సమాచారం. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ… పార్టీలో తనకు ప్రాధాన్యత లేకుండా ప్రయత్నాలు చేస్తున్నరంటూ ఎమ్మెల్సీ తప్పు పడుతున్నారట. సర్పంచ్ ఎన్నికల సందర్భంగా గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీలోని వర్గ విబేధాలు మాత్రం బయటపడ్డాయన్న చర్చ జరుగుతుంది.
రంగంలోకి హరీశ్
అధినేత కేసీఆర్ ఇలాఖాలో వర్గపోరు ఉంటే పార్టీకి తీవ్ర నష్టమని భావించిన.. హరీశ్ రావు, ఇద్దరు లీడర్లు వంటేరు ప్రతాప్ రెడ్డి, యాదవరెడ్డిని పిలిపించి మాట్లాడారట. కేసీఆర్ అసలు తమను కలవడం లేదని.. పట్టించుకోవడం లేదని క్యాడర్ అసహనంగా ఉన్నట్టు సమాచారం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాగూ కలవలేదు.. కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా తమను పలుకరించవచ్చు కదా అంటూ నేతలు గుసగుసలాడుకుంటున్నట్టు తెలుస్తున్నది. కేసీఆర్ అందుబాటులో ఉండకపోవడంతో తమ మంచి చెడును హరీశ్రావుకు చెప్పుకుంటున్నారట గజ్వేల్ నాయకులు. రాబోయే పరిషత్, మున్సిపల్ ఎన్నికలకు ఇప్పటినుంచే రంగం సిద్దం చేయాలి. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిస్తే వేరే సంకేతాలు పోతాయని బీఆర్ఎస్ క్యాడర్ టెన్షన్ ఉన్నారట. ఈ ఇద్దరు నేతలు మాత్రం ఇలా విడిపోయి ఉంటే కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుందని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read Also: తెలంగాణలో పార్టీ బలోపేతంపై జనసేనాని దృష్టి ..
Follow Us On : WhatsApp


