కలం, వెబ్ డెస్క్: హుజురాబాద్ (Huzurabad)లో డంపింగ్ యార్డ్ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తోంది. నియోజకవర్గంలో మూడు జిల్లాలకు కలిపి డంపింగ్ యార్డు (Dumping Yard) ఏర్పాడు చేయడాన్ని నిరసిస్తూ నేడు బీఆర్ఎస్ హూజురాబాద్ బంద్కు పిలుపునిచ్చింది. సర్సపల్లిలో డంపింగ్ యార్డ్ వద్దంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగి నినాదాలు చేశారు. ఈ నిరసనల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో వరంగల్, హన్మకొండ, కరీంనగర్ నుంచి చెత్తను హూజురాబాద్లోని డంపింగ్ యార్డుకు తీసుకురానున్నారు. వరంగల్, హన్మకొండ నుంచి 400 మెట్రిక్ టన్నులు, కరీంనగర్ నుంచి 180 టన్నుల చెత్త సేకరిస్తున్నారు. దీనిపై హూజురాబాద్లో విపక్షలు భగ్గుమంటున్నాయి. మూడు జిల్లాల చెత్త తీసుకొచ్చి మా నియోజకవర్గంలో వేయడం ఏంటని స్థానిక నేతలు ప్రశ్నిస్తున్నారు. చెత్తతో గాలి, నీరు కలుషితం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తారు. డంపింగ్ యార్డ్ వెంటనే రద్దు చేయాలని అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్థానిక హోటల్స్ నిర్వాహకులు, వ్యాపార సంఘాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటును ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే ఈ నెల 7, 8 తేదీల్లో దీక్ష చేపడతానని ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి హెచ్చరించారు.

