కలం, వెబ్ డెస్క్ : తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కొందరు కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను టీటీడీ చైర్మన్ గా (TTD Chairman) బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే కొందరు రాజీనామా చేయాలంటున్నారన్నారు. వారి అవినీతి బండారం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతోనే ఇలా చేస్తున్నారని తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీలో (TTD) ఎన్నో భారీ స్కామ్ లు జరిగాయని బీఆర్ నాయుడు ఆరోపించారు. శ్రీవారి ఆలయ పవిత్రత దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే తాను ఇప్పటివరకు ఆ విషయాలను పూర్తిగా బయట పెట్టలేదని వెల్లడించారు. మాజీ చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలపై ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో వారికి చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. అటు జగన్, ఇటు కరుణాకర్ రెడ్డిల దోపిడీ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసని, వారి చీప్ పాలిటిక్స్ తన దగ్గర సాగవని ఆయన హెచ్చరించారు.
ప్రస్తుతం జరుగుతున్న ఏకసభ్య కమిషన్ విచారణ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తనపై ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ నాయుడు (BR Naidu) అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకే తాను ఇంతకాలం సంయమనంతో వేచి చూశానని, అయితే ఇకపై తనపై తప్పుడు ప్రచారం చేసే వారిని వదిలిపెట్టబోనని చెప్పారు. ఈ వ్యవహారంపై చట్టపరంగా పోరాటం చేస్తానని, తనపై బురదజల్లే ప్రయత్నం చేసే వారికి లీగల్ గా బుద్ధి చెబుతానని ఆయన పేర్కొన్నారు.
Read Also: కరకగూడెంలో దారుణం.. ఆదివాసీ దారుణ హత్య
Follow Us On: Sharechat

