కలం, స్పోర్ట్స్: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ – 2026 (BPL – 2026) అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. ఈ ఏడాది BPL టోర్నమెంట్ను రద్దు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ (Tamim Iqbal) గురువారం ప్రకటించారు. టోర్నీని పూర్తిగా ప్రక్షాళన చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
కొన్ని ఫ్రాంచైజీలు లీగ్ నిబంధనలను పాటించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తమీమ్ తెలిపారు. 2012లో ప్రారంభమైన ఈ లీగ్, తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. బకాయిలు చెల్లించకపోవడం, బ్యాంక్ గ్యారంటీల సమస్యలతో గత రెండేళ్లలో బోర్డు దాదాపు $3.3 మిలియన్ల లాభాన్ని కోల్పోయిందని ఆయన వెల్లడించారు.
ఫ్రాంచైజీ లీగ్ ద్వారా బోర్డుకు లాభం రావాలి తప్ప నష్టం రాకూడదని, ఈ లోపాలను సరిదిద్దే వరకు నష్టాల్లో లీగ్ నిర్వహించడం సరికాదని చెప్పారు. ఈ నిర్ణయం వల్ల ఆటగాళ్లు తీవ్రంగా నిరాశ చెందుతారని తనకు తెలుసని, కానీ బోర్డు గర్వపడేలా లీగ్ను తీర్చిదిద్దడమే అత్యంత ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ లీగ్లో గతంలో బెట్టింగ్ ఆరోపణలు రావడంతో ఒక ఆటగాడితో పాటు పలువురు అధికారులను బోర్డు సస్పెండ్ చేసింది.
అంతేకాకుండా, BCB అధికారి నజ్ముల్ ఇస్లాం వ్యాఖ్యలకు నిరసనగా ఆటగాళ్లు మ్యాచ్లను బహిష్కరించిన సంఘటనలు జరిగాయి. ఆటగాళ్ల వికాసం కోసం U-17, U-19, U-23 జట్లతో ‘గేమ్ డెవలప్మెంట్ ట్రోఫీ’ ప్రారంభోత్సవంలో తమీమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలలైనా లేదా ఏడాది సమయం తీసుకుని అయినా లీగ్ను సరైన పద్ధతిలో పునరుద్ధరిస్తామని, త్వరలోనే విదేశీ ఫ్రాంచైజీలను కూడా ఆహ్వానించే ఆలోచనలో ఉన్నామని తెలిపారు.

