కలం, నిర్మల్: పెండింగ్ ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం (BJYM) డిమాండ్ చేసింది. గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని వారించడంతో, కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు. బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. వెంటనే పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే మరిన్ని ఆందోళన కార్యక్రమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సూరజ్ నాయక్, నాయకులు జుట్టు దినేష్, వెంకటేశ్, అర్జున్, హరీశ్, ఉదయ్, భరత్, సాయి పాల్గొన్నారు.

